సుశాంత్ సింగ్ మృతి కేసు.. రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్

Admin 2024-02-27 11:51:52 ENT
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సినీ నటి రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులకు పెద్ద ఊరట లభించింది. వీరిపై సీబీఐ జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్‌ను బాంబే హైకోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా నాలుగు వారాల పాటు స్టే విధించాలన్న సీబీఐ న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.

జూన్ 14, 2020 న, సుశాంత్ ముంబైలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే సుశాంత్ ఆత్మహత్యకు రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ సుశాంత్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ. 15 కోట్లు బదిలీ చేశారని ఆయన తండ్రి కేకే సింగ్ ఆరోపించారు.

ఈ క్రమంలో రియా చక్రవర్తిని ఈడీ ప్రశ్నించింది. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చినట్లు రియా, ఆమె సోదరుడు షోక్, తండ్రి ఇంద్రజిత్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇద్దరూ జైలుకు వెళ్లారు. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. దీంతో వారు బాంబే హైకోర్టును ఆశ్రయించగా... లుకౌట్ సర్క్యులర్‌ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.