సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంగా ఉన్నాడన్న నాగబాబు

Admin 2021-09-30 05:54:15 ENT
సాయిధరమ్ తేజ్ ఈ నెల 10వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, ఆయన ప్రస్తుత ఆరోగ్యానికి సంబంధించి అప్ డేట్స్ రావడం లేదు. తేజ్ ఆరోగ్యం ఎంతవరకు మెరుగు పడిందనే విషయంలో క్లారిటీ లేదు. ఇటీవల జరిగిన 'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తేజ్ కోమాలో ఉన్నాడని, అందుకే ఈవెంట్ కు తాను వచ్చానని చెప్పారు. మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ... ఆసుపత్రిలో తేజ్ ను కలిసిన తర్వాతే అక్టోబర్ 1న సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించామని చెప్పారు. కోమాలో ఉన్నాడని పవన్, ఈవెంట్ ను చూశాడని దేవ కట్టా చెరో విధంగా చెప్పడం గందరగోళానికి దారితీసింది. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, తేజ్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పారు. మీ ప్రార్థనలన్నీ ఫలించి తేజ్ క్షేమంగా బయటపడ్డాడని తెలిపారు. త్వరలోనే మన ముందుకు వస్తాడని చెప్పారు.